మే 15, (నేటి తెలుగు పత్రిక): శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఏఎంసీఏ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాయలసీమ అభివృద్ధిలో ఈ ప్రాజెక్ట్ కీలక మైలురాయిగా నిలుస్తుందని అన్నారు.పుట్టపర్తి ఇకపై దేశ రక్షణ రంగంలో వ్యూహాత్మక కేంద్రంగా మారబోతోందని చంద్రబాబు పేర్కొన్నారు. అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ప్రాజెక్ట్ ద్వారా ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో ఆంధ్రప్రదేశ్ ముఖ్య పాత్ర పోషిస్తుందని తెలిపారు.రూ.15 వేల కోట్లకు పైగా పెట్టుబడులతో అమలయ్యే ఈ ప్రాజెక్ట్ ద్వారా వేలాది ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయని సీఎం వెల్లడించారు. ఫైటర్ జెట్ తయారీ, ఫ్లైట్ టెస్టింగ్ కేంద్రంగా పుట్టపర్తి అభివృద్ధి చెందుతుందని చెప్పారు.కర్నూలు జిల్లాలో డ్రోన్ సిటీ ఏర్పాటుతో పాటు రక్షణ రంగానికి సంబంధించిన మరిన్ని పరిశ్రమలు రాష్ట్రానికి రానున్నాయని తెలిపారు. భారత్ ఫోర్జ్, హెచ్ఎఫ్సీఎల్, భారత్ డైనమిక్స్ వంటి సంస్థలతో కలిసి ఏరోస్పేస్ రంగాన్ని విస్తరిస్తున్నామని పేర్కొన్నారు.రాయలసీమ ఒకప్పుడు కరువు ప్రాంతంగా ఉండేదని, ఇప్పుడు పారిశ్రామిక అభివృద్ధి కేంద్రంగా మారుతోందని చంద్రబాబు అన్నారు. జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్స్, కడప స్టీల్ ప్లాంట్ వంటి ప్రాజెక్టులతో ప్రాంత అభివృద్ధికి కొత్త ఊపు వస్తుందని తెలిపారు.2028 నాటికి కడప స్టీల్ ప్లాంట్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, సాగునీటి ప్రాజెక్టుల ద్వారా ప్రతి ఎకరాకు నీరు అందించే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం వెల్లడించారు.
