మే 19, (నేటి తెలుగు పత్రిక): దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. వారం రోజుల వ్యవధిలో రెండోసారి చమురు సంస్థలు ధరలను పెంచడంతో వాహనదారులపై అదనపు భారం పడుతోంది. తాజాగా లీటర్కు సుమారు 90 పైసల చొప్పున పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి.తాజా పెంపుతో ఆంధ్రప్రదేశ్లోని పలు నగరాల్లో ఇంధన ధరలు మరింత పెరిగాయి. గుంటూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.113.79కు చేరగా, డీజిల్ రూ.101.49గా నమోదైంది. విశాఖపట్నంలో పెట్రోల్ రూ.112.90, డీజిల్ రూ.100.69గా ఉంది.తెలంగాణ రాజధాని హైదరాబాద్లో కూడా ఇంధన ధరలు పెరిగాయి. ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ.111.79 కాగా, డీజిల్ రూ.99.86కు చేరింది. ఇటీవలే చమురు కంపెనీలు లీటర్పై రూ.3 వరకు ధరలు పెంచిన నేపథ్యంలో తాజా పెంపు సామాన్యులకు మరింత భారంగా మారింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల పెరుగుదల, రవాణా వ్యయాల ప్రభావంతో ఇంధన ధరలు పెరుగుతున్నట్లు సమాచారం.ఇంధన ధరల పెరుగుదలతో రవాణా ఖర్చులు, నిత్యావసర వస్తువుల ధరలపై కూడా ప్రభావం పడే అవకాశముందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
