మే 19, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలోని సాగునీటి రంగ అభివృద్ధి, పెండింగ్ ప్రాజెక్టుల పురోగతిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. పోలవరం సహా అన్ని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు నిర్దేశిత గడువులోగా పూర్తి కావాలని ఆయన అధికారులను ఆదేశించారు.సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్తో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రాజెక్టుల అమలులో ఆలస్యం సహించబోమని, ప్రతి దశలో వేగం మరియు నాణ్యతకు సమ ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం స్పష్టం చేశారు.పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర భవిష్యత్ అవసరాలకు కీలకంగా పేర్కొన్న చంద్రబాబు, పనులను మరింత వేగవంతం చేయాలని సూచించారు. అలాగే కాలువల ఆధునీకరణ, నీటి నిల్వ సామర్థ్య పెంపు, పంపిణీ వ్యవస్థ బలోపేతంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. రైతుల భాగస్వామ్యంతో సాగునీటి నిర్వహణను మరింత సమర్థవంతం చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు.
