మే 20, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్లోని సుమారు 16 వేల మెడికల్ షాపులు ఇవాళ బంద్ పాటించనున్నాయి. ఆన్లైన్ ఫార్మసీలు భారీ డిస్కౌంట్లతో మందులు విక్రయించడాన్ని నిరసిస్తూ తెలంగాణ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకుంది.స్థానిక మెడికల్ షాపులకు కేవలం 25 శాతం వరకు మాత్రమే మార్జిన్ వస్తుండగా.. ఆన్లైన్ ఫార్మసీలు 40 నుంచి 60 శాతం వరకు డిస్కౌంట్లు ఎలా ఇస్తున్నాయని అసోసియేషన్ ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. ఈ విధానం వల్ల చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఆన్లైన్ ఫార్మసీలపై నియంత్రణ తీసుకురావాలని, ఈ వ్యవస్థపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని అసోసియేషన్ డిమాండ్ చేసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో మెడికల్ షాపులు మూతపడటంతో ప్రజలు ముందుగానే మందులు కొనుగోలు చేసేందుకు పరుగులు తీశారు.
