మే 20, (నేటి తెలుగు పత్రిక): కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీపై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. అంబానీ, అదానీలకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం నిర్మించిన ఆర్థిక వ్యవస్థ కూలిపోవడం ఖాయమని వ్యాఖ్యానించారు. ఆ ప్రభావం పెద్ద పారిశ్రామిక వేత్తలపై కాకుండా సామాన్య ప్రజలపైనే ఎక్కువగా పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ పర్యటన సందర్భంగా మాట్లాడిన రాహుల్.. దేశ ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల, చిన్న వ్యాపారాల సంక్షోభంపై మోదీ ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదని విమర్శించారు. “ప్రజలు విదేశీ పర్యటనలు తగ్గించుకోవాలని సూచించే ప్రధాని.. తానే ప్రపంచ దేశాలు తిరుగుతున్నారు” అంటూ రాహుల్ ఎద్దేవా చేశారు. ప్రజలకు ఒకలా చెప్పి, తాను మరోలా వ్యవహరించడం సరికాదని మండిపడ్డారు.దేశంలో పెరుగుతున్న ఆర్థిక అసమానతల వల్ల మధ్యతరగతి, రైతులు, యువత తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
