మే 20, (నేటి తెలుగు పత్రిక): నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ సొంత పార్టీ నేతలపైనే సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు సీనియర్ నేతలు ధర్నాలు చేస్తున్నట్లు నటించి, కావాలనే పోలీసులను పిలిపించుకుని అరెస్టయ్యారని ఆరోపించారు. నిజామాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. కొందరు నేతలు పోలీసులతో స్నేహంగా మాట్లాడుకుంటూ కార్లలో ఎక్కిన వీడియోలు తన వద్ద ఉన్నాయని వెల్లడించారు. పార్టీ కోసం నిజాయితీగా పనిచేయాలని, లేదంటే ఇంట్లో కూర్చోవాలని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.పార్టీ కార్యకలాపాల్లో నాటకాలు అవసరం లేదని, ప్రజల్లో పార్టీ ప్రతిష్ఠ దెబ్బతినేలా ఎవరూ వ్యవహరించకూడదని అర్వింద్ హెచ్చరించారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారగా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
