మే 21, (నేటి తెలుగు పత్రిక): జనగణనలో కులగణన నిర్వహించడాన్ని సుప్రీంకోర్టు సమర్థించడం చారిత్రాత్మక నిర్ణయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ అంశంలో తెలంగాణ ప్రభుత్వం ముందుగానే తీసుకున్న నిర్ణయానికి దేశవ్యాప్తంగా గుర్తింపు లభించిందని పేర్కొన్నారు.తెలంగాణ ఇప్పటికే సమగ్ర కుల సర్వే నిర్వహించి సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ అంశాలపై వివరాలను సేకరించిందని సీఎం గుర్తుచేశారు. బలహీన వర్గాల హక్కుల పరిరక్షణకు ఈ సర్వే కీలకంగా మారిందన్నారు.సుప్రీంకోర్టు తాజా అభిప్రాయం నేపథ్యంలో దేశవ్యాప్తంగా జరిగే జనగణనలో వెంటనే కులగణనను చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు. తెలంగాణ తీసుకున్న నిర్ణయాన్ని అత్యున్నత న్యాయస్థానం సమర్థించడం రాష్ట్రానికి గర్వకారణమని సీఎం వ్యాఖ్యానించారు. సమాజంలోని వెనుకబడిన వర్గాల అభివృద్ధికి కులగణన ఉపయోగపడుతుందని, దీని ద్వారా సమాన అవకాశాల కల్పనకు మార్గం సుగమమవుతుందని రేవంత్ రెడ్డి తెలిపారు.
