మే 21, (నేటి తెలుగు పత్రిక): ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా వైట్ కాలర్ ఉద్యోగాలకు ప్రమాదం ఏర్పడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో యువత తమ దృక్పథాన్ని మార్చుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. బ్లూ కాలర్ మరియు స్కిల్డ్ ఉద్యోగాల వైపు ఎక్కువగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు.డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో మీడియాతో మాట్లాడిన సీఎం, ప్రపంచ ఉద్యోగ రంగంలో వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయని పేర్కొన్నారు. “ఏఐ కారణంగా వైట్ కాలర్ ఉద్యోగాలు తగ్గే అవకాశం ఉంది. కానీ స్కిల్డ్, సెమీ స్కిల్డ్ బ్లూ కాలర్ ఉద్యోగాలకు ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ ఉంది” అని చెప్పారు.యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించిందని, ఐటీఐలను ఆధునిక టెక్నాలజీ కేంద్రాలుగా మారుస్తున్నామని వివరించారు. పాలిటెక్నిక్ కాలేజీలను కూడా అప్గ్రేడ్ చేస్తున్నట్లు తెలిపారు.జర్మనీ, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్ వంటి దేశాల్లో స్కిల్డ్ వర్క్కు మంచి డిమాండ్ ఉందని, అక్కడి భాషల శిక్షణ కోసం ఒప్పందాలు చేసుకున్నామని సీఎం చెప్పారు. “ప్రపంచ మార్పులను అర్థం చేసుకుని తెలంగాణను ప్రత్యామ్నాయ అవకాశాల కేంద్రంగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం” అని ఆయన పేర్కొన్నారు.
