మే 22, (నేటి తెలుగు పత్రిక): హరీశ్రావు అమెరికా పర్యటనలో తెలంగాణ ప్రభుత్వ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఫ్యూచర్ సిటీ ప్రణాళికను రద్దు చేసి, ఫార్మా సిటీ ప్రాజెక్టును తిరిగి పునరుద్ధరిస్తామని ప్రకటించారు.ఫ్యూచర్ సిటీ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని ఆయన ఆరోపించారు. ఫార్మా సిటీ ద్వారా లక్షలాది ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని, ఇప్పటికే చట్టపరంగా ఆమోదం పొందిన ప్రాజెక్టును కొనసాగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.ఫార్మా సిటీ అభివృద్ధి చెందితే బీఆర్ఎస్కు రాజకీయంగా మైలేజ్ వస్తుందనే ఉద్దేశంతోనే ప్రస్తుత ప్రభుత్వం ఆ ప్రాజెక్టును నిలిపివేసిందని హరీశ్రావు విమర్శించారు. పరిశ్రమలు, ఉపాధి అవకాశాల కంటే రాజకీయ ప్రయోజనాలకే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మండిపడ్డారు.తెలంగాణ యువతకు భారీ స్థాయిలో ఉపాధి కల్పించే సామర్థ్యం ఫార్మా సిటీకి ఉందని, బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే పరిశ్రమల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు.
