మే 22, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రైతులకు అవసరమైన గన్నీ బ్యాగులు అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. ధాన్యం సేకరణ ప్రక్రియలో ప్రభుత్వం సరైన ప్రణాళికతో ముందుకు సాగడం లేదని ఆరోపించారు. హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఆందోళనలు చేపడుతున్న పరిస్థితి నెలకొందన్నారు. మంచిర్యాల జిల్లాలో రైతుల మరణాల అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రభుత్వం స్పందనపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటివరకు పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు జరగలేదని, రైతులు నిరాశలో ఉన్నారని పేర్కొన్నారు.సీఎం రేవంత్ రెడ్డి సంక్షోభాన్ని గుర్తించకుండా ప్రకటనలకే పరిమితమవుతున్నారని కేటీఆర్ విమర్శించారు. రైతుల సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
