మే 22, (నేటి తెలుగు పత్రిక): రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లిన ఇద్దరు ఇంటర్మీడియట్ విద్యార్థులు మిడ్ మానేరు జలాశయంలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తంగళ్లపల్లి మండలం గోపాలరావుపల్లి వద్ద శుక్రవారం ఉదయం జరిగింది.సిరిసిల్లకు చెందిన ఐదుగురు యువకులు ఈత కోసం జలాశయంలోకి దిగగా, వారిలో మణికంఠకు ఈత రాకపోవడంతో నీటిలో చిక్కుకున్నాడు. అతడిని కాపాడేందుకు హరిచరణ్ గౌడ్ ప్రయత్నించగా ఇద్దరూ నీటిలో మునిగిపోయారు. మృతులు శాంతినగర్కు చెందిన హరిచరణ్ గౌడ్(18), చిర్లవంచ ఆర్ అండ్ ఆర్ కాలనీకి చెందిన మణికంఠ(17)గా గుర్తించారు.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ విషాదంతో రెండు కుటుంబాల్లో దుఃఖచాయలు అలుముకున్నాయి.
