అమరావతి, మే 22, (నేటి తెలుగు పత్రిక): వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాజకీయ లబ్ధి కోసం జగన్ ఏ స్థాయికైనా దిగజారుతారని ఆయన ఆరోపించారు. అమరావతిలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రి గొట్టిపాటి, సొంత తండ్రి మరణాన్ని కూడా రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు. జగన్ రాజకీయ శైలి, పరిపాలన తీరు ప్రజలకు ఇప్పటికే అర్థమైందని అన్నారు.గత ఐదేళ్ల పాలనలో తండ్రి, బాబాయ్ హత్యలపై ఉన్న అనుమానాలను నివృత్తి చేయకుండా ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం సానుభూతి కోరడం సరికాదని ఆయన విమర్శించారు. అధికారం ఉన్నప్పుడు అహంకారంగా వ్యవహరించి, ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చాక సానుభూతి రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. 2024 ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి తగిన బుద్ధి చెప్పారని, రాష్ట్రాభివృద్ధికి అనుగుణంగా కొత్త ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని ఆయన అన్నారు. చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలు భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా ఉన్నాయని పేర్కొన్నారు.మూడు రాజధానుల అంశాన్ని ప్రజలు తిరస్కరించారని, ఇప్పుడు అమరావతి అభివృద్ధిని చూసి విమర్శలు చేయడం సమంజసం కాదని అన్నారు. రాష్ట్రానికి నష్టం చేసే విధంగా జగన్ వ్యాఖ్యలు ఉన్నాయని, వాటిని ప్రజలు విశ్వసించరని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు.
