మే 22, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్లో జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి బ్యాంకులు కీలక పాత్ర పోషించాలని ఆయన పిలుపునిచ్చారు.బ్యాంకులు కేవలం పంట రుణాలకే పరిమితం కాకుండా గ్రామీణ మౌలిక వసతులు, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు కూడా రుణాలు పెంచాలని సూచించారు. తెలంగాణలో క్రెడిట్–డిపాజిట్ నిష్పత్తి 130.78 శాతం నమోదు కావడం సానుకూల పరిణామమని మంత్రి తెలిపారు. వ్యవసాయ రంగానికి రుణాల పంపిణీలో రాష్ట్రం మంచి ప్రగతి సాధించిందని పేర్కొన్నారు.పంట నిల్వ కోసం గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజీలు, సైలోల నిర్మాణానికి బ్యాంకులు మద్దతు ఇవ్వాలని కోరారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు ఆర్థిక సహాయం అందించాల్సిన అవసరం ఉందని అన్నారు.కౌలు రైతులకు సమయానికి రుణాలు ఇవ్వాలని, సోలార్ వ్యవసాయం, మైక్రో ఇరిగేషన్ వంటి ఆధునిక పద్ధతులకు రుణాలను పెంచాలని మంత్రి తుమ్మల సూచించారు.
