మే 23, (నేటి తెలుగు పత్రిక): ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేస్తున్న సెంట్రింగ్ కార్మికులకు తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత మద్దతు తెలిపారు. కార్మికులతో ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రెండు రోజుల్లో స్పందించకపోతే తాను కూడా కార్మికులతో కలిసి ధర్నాలో కూర్చుంటానని హెచ్చరించారు. హైదరాబాద్లోని భారీ భవనాల నిర్మాణంలో సెంట్రింగ్ కార్మికుల పాత్ర ఎంతో కీలకమని కవిత పేర్కొన్నారు. ప్రాణాలను పణంగా పెట్టి పని చేస్తున్నప్పటికీ వారికి సరైన రక్షణ, గుర్తింపు లేకపోవడం బాధాకరమన్నారు. హైడ్రా చర్యల వల్ల ఇళ్లు కూల్చే సమయంలో కార్మికుల మెటీరియల్ నష్టపోతున్నా ఎలాంటి పరిహారం అందడం లేదని విమర్శించారు.సెంట్రింగ్ కార్మికులు ఈఎస్ఐ కార్డులు, స్క్వేర్ మీటర్కు రూ.51 చెల్లింపు, ప్రమాద మరణాల పరిహారాన్ని రూ.20 లక్షలకు పెంచాలని కోరుతున్నారని తెలిపారు. ఈ డిమాండ్లు పూర్తిగా సహేతుకమైనవేనని, వాటికి తమ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.ప్రభుత్వం కార్మికులను పట్టించుకోకపోతే వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని కవిత హెచ్చరించారు. తెలంగాణ నిర్మాణంలో కార్మికుల పాత్రను ఎవరూ విస్మరించలేరని ఆమె పేర్కొన్నారు.
