మే 23, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్లోని గాంధీ భవన్లో మీడియాతో నిర్వహించిన చిట్చాట్ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రజలు ఇప్పటికే బీఆర్ఎస్ పాలనను తిరస్కరించారని, ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదని స్పష్టం చేశారు. తెలంగాణ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా అమలు చేస్తోందని పేర్కొన్నారు.ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్ తెలంగాణకు గేమ్ఛేంజర్గా మారబోతోందని మహేశ్ గౌడ్ అన్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా భారీ స్థాయిలో పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చే అవకాశముందని తెలిపారు. ప్రపంచ స్థాయి మౌలిక వసతులతో కొత్త నగర అభివృద్ధి చేపట్టడం ద్వారా తెలంగాణ అంతర్జాతీయ పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తోందన్నారు.ఇటీవల నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ ద్వారా అనేక అంతర్జాతీయ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులకు ముందుకు వచ్చాయని చెప్పారు. ముఖ్యంగా హెల్త్, ఎడ్యుకేషన్, టెక్నాలజీ రంగాల్లో కొత్త అవకాశాలు ఏర్పడుతున్నాయని తెలిపారు. యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజల ఆశలు నెరవేరలేదని విమర్శించిన మహేశ్ గౌడ్.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శక పాలనతో ముందుకు సాగుతోందన్నారు. రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
