మే 24, (నేటి తెలుగు పత్రిక): తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల సెల్సియస్కు పైగా నమోదవుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండుతున్న ఎండల కారణంగా వడదెబ్బ బారినపడి ఒక్కరోజే 56 మంది మృతి చెందిన ఘటన ఆందోళన కలిగిస్తోంది.తెలంగాణలో అత్యధికంగా 40 మంది వడదెబ్బ కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 19 మంది మృతి చెందగా, ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో ఆరుగురి చొప్పున మరణాలు నమోదయ్యాయి. అదిలాబాద్ జిల్లాలో ఇద్దరు, నిజామాబాద్ జిల్లాలో ఒకరు వడదెబ్బకు బలైనట్లు అధికారులు తెలిపారు.ఇక ఆంధ్రప్రదేశ్లో 16 మంది మృతి చెందినట్లు సమాచారం. గుంటూరు, పల్నాడు, విజయవాడ, అనకాపల్లి, ఏలూరు జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతల ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వృద్ధులు, కూలీలు, బయట పనులు చేసే వారు ఎక్కువగా వడదెబ్బ బారినపడుతున్నారని వైద్యులు చెబుతున్నారు.వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప మధ్యాహ్న సమయంలో బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. తగినంత నీరు తాగడం, తేలికపాటి దుస్తులు ధరించడం, నేరుగా ఎండలో ఎక్కువసేపు ఉండకపోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్రమత్తమై వైద్యశాఖ అధికారులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశాయి. ఆసుపత్రుల్లో ప్రత్యేక వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయాలని, గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించాయి.
