మే 24, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ వ్యాప్తంగా వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద ‘రైతు గోసా – బీజేపీ భరోసా’ యాత్ర చేపట్టనున్నట్లు మెదక్ ఎంపీ రఘునందన్ రావు ప్రకటించారు. రేపటి నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్రలో రాష్ట్రంలోని బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారని తెలిపారు.ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందని రఘునందన్ రావు ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి రైతులతో రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. అధికారుల నివేదికల ఆధారంగా తప్పుడు సమాచారం ఇవ్వకుండా, నేరుగా కొనుగోలు కేంద్రాలకు వెళ్లి రైతులతో మాట్లాడాలని సూచించారు. రాష్ట్రంలో 80 శాతం ధాన్యం కొనుగోలు జరిగిందని ప్రభుత్వం చెబుతోందని, నిజంగా అంత స్థాయిలో కొనుగోళ్లు జరిగాయా అనే విషయంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రైతుల పరిస్థితిని ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు రెండు రోజుల పాటు కొనుగోలు కేంద్రాల వద్ద కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. తమ లక్ష్యం రాజకీయాలు కాదని, రైతుల సంక్షేమమే ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు.
