మే 24, (నేటి తెలుగు పత్రిక): విశాఖపట్నంలోని మద్దిలపాలెం కాకతీయ కన్వెన్షన్ సెంటర్లో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన ‘ప్రజల కథే నా ఆత్మకథ’ పుస్తకావిష్కరణ సభ ఘనంగా నిర్వహించారు. రాజకీయ జీవితం, ప్రజాసేవ, సామాన్యులతో ఉన్న అనుబంధాన్ని ప్రతిబింబించేలా ఈ పుస్తకాన్ని రూపొందించినట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమానికి ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు, మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. సభలో పుస్తకాన్ని అధికారికంగా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా కంభంపాటి హరిబాబు మాట్లాడుతూ.. సాధారణ కుటుంబం నుంచి ప్రజా నాయకుడిగా ఎదిగి గవర్నర్ స్థాయికి చేరుకున్న బండారు దత్తాత్రేయ జీవితం యువతకు స్ఫూర్తిదాయకమని అన్నారు. ప్రజలతో మమేకమై పనిచేసిన ఆయన రాజకీయ ప్రస్థానం ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. తన రాజకీయ ప్రయాణంలో ఎదురైన అనుభవాలు, ప్రజల ఆశీస్సులే తన జీవితానికి బలమని చెప్పారు. అందుకే తన ఆత్మకథకు ‘ప్రజల కథే నా ఆత్మకథ’ అనే పేరు పెట్టినట్లు తెలిపారు. ప్రజల మద్దతుతోనే తాను ఈ స్థాయికి చేరుకున్నానని పేర్కొన్నారు.
