మే 25, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ కాంగ్రెస్లో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ మధ్య విభేదాలు ఉన్నాయన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పార్టీ బలోపేతంపై టీపీసీసీ చీఫ్ ఆశించిన స్థాయిలో దృష్టి పెట్టడం లేదని సీఎం అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం.ఇటీవల 2034 వరకు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించగా.. ఆ వెంటనే ‘బీసీ సీఎం’ అంశాన్ని మహేశ్ గౌడ్ ప్రస్తావించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పరిణామాల తర్వాత ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిందన్న ప్రచారం జోరందుకుంది.ఇదే సమయంలో మహేశ్ గౌడ్కు వ్యతిరేకంగా కొన్ని కథనాలు వెలువడటం కూడా రాజకీయ చర్చలకు దారితీసింది. అయితే తాజాగా మహేశ్ గౌడ్కు సీఎం రేవంత్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపినా.. ఇద్దరూ వ్యక్తిగతంగా కలవకపోవడం మరిన్ని ఊహాగానాలకు కారణమవుతోంది.
