అమరావతి, మే 25, (నేటి తెలుగు పత్రిక): వరుసగా ఇంధన ధరలు పెరుగుతుండటంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం 10 రోజుల్లోనే నాలుగు సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం అత్యంత దారుణమని విమర్శించారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన షర్మిల.. ప్రధాని నరేంద్రమోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “మోదీజీ లూటీదారు.. దేశ ప్రజలను దోచడంలో ఆయనను మించినవారు లేరు” అంటూ విమర్శించారు. ఇంధన ధరల పెంపుతో రోజుకు రూ.1,000 కోట్ల అదనపు భారం ప్రజలపై పడుతోందని ఆరోపించారు.దేశంలోనే అత్యధిక ఇంధన ధరలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయని పేర్కొన్న షర్మిల.. రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేశారు. వ్యాట్ తగ్గించాలంటూ కోరుతున్నప్పటికీ సీఎం చంద్రబాబు స్పందించడం లేదని విమర్శించారు.ఇంధనంపై విధిస్తున్న రూ.4 వ్యాట్తో పాటు రూ.1 రోడ్ సెస్సును కూడా వెంటనే రద్దు చేయాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. పెరుగుతున్న ధరలతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
