మే 25, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో రైతులకు ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు కొనసాగిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా మొక్కజొన్న, ధాన్యం కొనుగోలు చేస్తున్నామని తెలిపారు.సచివాలయంలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు నేతృత్వంలోని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా నేతల బృందం సీఎంను కలిసింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో రైతుల పరిస్థితి, కార్మికుల సమస్యలు, కనీస వేతనాల పెంపు వంటి అంశాలపై చర్చ జరిగింది.ఈ ఏడాది మొక్కజొన్న దిగుబడి భారీగా వచ్చిందని సీఎం పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం కొనుగోళ్లు చేయకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే ముందుకు వచ్చి రైతులకు మద్దతుగా నిలుస్తోందన్నారు. రాష్ట్రానికి ఆర్థిక భారం పడుతున్నా రైతుల ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకుంటున్నామని తెలిపారు.
