మే 25, (నేటి తెలుగు పత్రిక): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సీపీఐ ప్రతినిధి బృందం రాష్ట్ర సచివాలయంలో సమావేశమైంది. ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో కార్మికులకు కనీస వేతనాల పెంపు నిర్ణయంపై సీపీఐ నాయకులు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రైతుల సమస్యలపై స్పందించారు. కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ ఏడాది మొక్కజొన్న దిగుబడి భారీగా వచ్చిందని, కేంద్రం కొనుగోలు చేయకపోయినా రైతులు నష్టపోకుండా రాష్ట్ర ప్రభుత్వమే ముందుకు వచ్చి కొనుగోలు చేస్తోందన్నారు. ప్రభుత్వానికి ఆర్థిక భారం వచ్చినా రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని సీఎం తెలిపారు. ఈ సమావేశంలో సీపీఐ ఎమ్మెల్సీ సత్యం, పశ్య పద్మ, ఈ. నరసింహ, చాడ వెంకట్ రెడ్డి, బాగం హేమంతరావు, శంకర్, బాల నరసింహ, వీఎస్ బోసు, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
