అమరావతి, మే 25, (నేటి తెలుగు పత్రిక): తిరుపతి శ్రీ వేంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయంలో చిరుత సంచారం కలకలం రేపింది. ఈ ఘటనపై ఉప ముఖ్యమంత్రి, అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాజమండ్రి నుంచి అటవీ శాఖ ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడిన పవన్ కళ్యాణ్.. చిరుత ప్రస్తుతం ఎక్కడ ఉంది? దానిని పట్టుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అనే అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.చిరుత ప్రస్తుతం ఒక గదిలో దాక్కున్నట్లు, అటవీ శాఖ సిబ్బంది ఇప్పటికే అక్కడికి చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. నిర్దేశిత మార్గదర్శకాలకు అనుగుణంగా అప్రమత్తంగా వ్యవహరించాలని, చిరుతకు ఎలాంటి హాని కలగకుండా సురక్షితంగా పట్టుకుని అడవిలో విడిచిపెట్టాలని సూచించారు.రెస్క్యూ ఆపరేషన్లో జూ సిబ్బంది సహకారం కూడా తీసుకోవాలని అధికారులకు సూచించారు. అలాగే విద్యార్థులు, విశ్వవిద్యాలయ సిబ్బందికి ఎలాంటి ప్రమాదం లేకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.చిరుత సంచారంపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అన్ని రకాల భద్రతా చర్యలు అమల్లో ఉన్నాయని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం కార్యాలయం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
