మే 25, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ మెట్రో రైలుకు భారీ ఆర్థిక బలం చేకూరింది. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్ఎఫ్సీ)తో రూ.13,600 కోట్ల రీఫైనాన్సింగ్ ఒప్పందం కుదిరింది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఐఆర్ఎఫ్సీ సీఎండీ మనోజ్ కుమార్ దూబే, తెలంగాణ సీఎస్ రామకృష్ణరావు సమక్షంలో ఒప్పందంపై సంతకాలు జరిగాయి.ప్రస్తుతం ఉన్న రుణాలను రీఫైనాన్స్ చేయడం, నాన్ కన్వర్టిబుల్ డిబెంచర్లు, కమర్షియల్ పేపర్లు, వర్కింగ్ కాపిటల్ అవసరాలకు ఈ నిధులను వినియోగించనున్నారు. 20 ఏళ్ల కాలపరిమితితో త్రైమాసిక చెల్లింపుల విధానంలో ఈ రుణ సదుపాయం అందించనున్నారు.ఈ ఒప్పందంతో హైదరాబాద్ మెట్రోపై ఉన్న ఆర్థిక భారం తగ్గడంతో పాటు భవిష్యత్తు విస్తరణ ప్రణాళికలకు మార్గం సుగమం కానుంది. మరోవైపు ఎల్అండ్టీ మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ యాజమాన్యం తెలంగాణ ప్రభుత్వానికి బదిలీ కానుండటంతో మెట్రో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోకి రానుంది.తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పట్టణ రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే లక్ష్యమని సీఎస్ రామకృష్ణరావు తెలిపారు. హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యలు తగ్గించి ప్రజలకు మెరుగైన రవాణా సేవలు అందించేందుకు ఈ ఒప్పందం కీలకమని పేర్కొన్నారు.
