మే 25, (నేటి తెలుగు పత్రిక): పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో రైతులు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. రైతులపై నిజమైన చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వం ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేయడంతో పాటు ఇంధన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో రూ.8,749 కోట్లను జమ చేసిందని మంత్రి తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ నేతలు రైతు ప్రేమ పేరుతో యాత్రలు చేయడం కపట రాజకీయాలేనని విమర్శించారు. రైతుల సమస్యలను పరిష్కరించకుండా రాజకీయ డ్రామాలు చేస్తున్నారని పొన్నం ఎద్దేవా చేశారు.
