విజయవాడ,మే 25, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఒక MSME పార్క్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. విజయవాడలో నిర్వహించిన MSME గ్రోత్ సమ్మిట్లో ఆయన కీలక ప్రకటనలు చేశారు.ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 100 MSME పార్కులకు శంకుస్థాపన చేశామని సీఎం తెలిపారు. పారిశ్రామిక రంగ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. పరిశ్రమలకు ప్రోత్సాహకంగా ఇప్పటికే రూ.500 కోట్ల మేర ఇన్సెంటివ్స్ విడుదల చేశామని చెప్పారు. అదేవిధంగా రూ.200 కోట్లతో క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు.ప్రైవేట్ పారిశ్రామిక పార్కులకు కూడా ప్రోత్సాహకాలు అందిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధిని వేగవంతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.అలాగే ఐదు లక్షల మంది డ్వాక్రా మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. మహిళల ఆర్థిక సాధికారత కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామని సీఎం పేర్కొన్నారు.
