మే 27, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలోని 50 వేల మంది గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రతి నెలా మొదటి తేదీననే జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ సీఎం ఎ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఐఏఎస్ అధికారుల మాదిరిగానే పంచాయతీ సిబ్బందికి కూడా సమయానికి వేతనాలు అందాలని స్పష్టం చేశారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖపై నిర్వహించిన సమీక్షలో ప్రతినెలా రూ.50 కోట్లు ప్రత్యేకంగా విడుదల చేస్తామని తెలిపారు.అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు సహా అన్ని శాఖల సిబ్బందికి జీతాలు ఆలస్యం కాకూడదని హెచ్చరించారు. గ్రామ పంచాయతీల స్వంత ఆదాయాన్ని బ్యాంకు ఖాతాల్లో జమ చేసేలా చట్ట సవరణలు చేపట్టాలని సూచించారు. పెన్షన్లను పోస్టల్ విధానం బదులు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని ఆదేశించారు. అర్హులైన వారికి మాత్రమే పెన్షన్లు అందేలా ఆధార్, ఓటర్ ఐడీ, సర్వే డేటా ఆధారంగా క్రమబద్ధీకరణ చేపట్టాలని తెలిపారు.
