మే 28, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్మారకవేదిక వద్ద దివంగత మాజీ ముఖ్యమంత్రి, సినీ మహానటుడు నందమూరి తారక రామారావు 103వ జయంతిని ఘనంగా నిర్వహించారు. అభిమానులు, పార్టీ శ్రేణులు, సినీ ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎన్టీఆర్కు నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఉదయం వేళ స్మారకవేదికకు చేరుకుని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. జూనియర్ ఎన్టీఆర్ రాకతో అక్కడి ప్రాంగణం అభిమానులతో కిక్కిరిసిపోయింది. “జై ఎన్టీఆర్” నినాదాలతో ప్రాంతమంతా మార్మోగింది. అభిమానులకు అభివాదం చేసిన జూనియర్ ఎన్టీఆర్ కొద్దిసేపు అక్కడ గడిపారు.సినీరంగంలో ఎన్నో చిరస్మరణీయ పాత్రలతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఎన్టీఆర్, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారని అభిమానులు కొనియాడారు. తెలుగుదేశం పార్టీ స్థాపించి ప్రజలకు సంక్షేమ పాలన అందించిన మహానేతగా ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. ఎన్టీఆర్ సేవలను స్మరించుకుంటూ ప్రతి ఏడాది జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నామని పార్టీ నాయకులు తెలిపారు.
