మే 28, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని మరింత పారదర్శకంగా అమలు చేసేందుకు ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. మహాలక్ష్మి పథకం కింద ప్రయాణించే మహిళలకు ప్రత్యేక స్మార్ట్ కార్డులు జారీ చేయనుంది. ఈ కార్డుల పంపిణీని జూన్ 2 నుంచి ప్రారంభించేందుకు ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం మహిళలు ఆధార్ కార్డు చూపించి ఉచిత ప్రయాణం చేస్తున్నారు. ఇకపై ఆధార్కు బదులుగా స్మార్ట్ కార్డు చూపిస్తేనే ఉచిత ప్రయాణానికి అనుమతి ఇవ్వనున్నారు. ఏటీఎం కార్డు తరహాలో చిప్, ఫొటో, క్యూ ఆర్ కోడ్తో ఈ కార్డులు రూపొందించనున్నారు.దుర్వినియోగాన్ని అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇతర రాష్ట్రాల వారు నకిలీ ఆధార్ కార్డులతో ప్రయాణిస్తున్న ఘటనలు వెలుగులోకి రావడంతో ప్రత్యేక స్మార్ట్ కార్డుల విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నారు. మొదట ప్రతి జిల్లాలో ఒక మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి కార్డుల పంపిణీ చేపట్టనున్నారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తారు. కార్డుల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడంతో పాటు దరఖాస్తు విధానం, కేంద్రాల వివరాలను ఆర్టీసీ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నారు. కార్డులు అందే వరకు మహిళలు ఆధార్ కార్డుతోనే ఉచితంగా ప్రయాణించవచ్చని అధికారులు స్పష్టం చేశారు.

