మే 29, (నేటి తెలుగు పత్రిక): తమిళనాడులోని రాణిపేట జిల్లా షోలింగర్లో ఉన్న యోగ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని మంత్రి నారా లోకేశ్ శుక్రవారం సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు.ఆలయానికి చేరుకున్న మంత్రి లోకేశ్కు ఆలయ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. అనంతరం రోప్వే ద్వారా కొండపై ఉన్న ఆలయానికి చేరుకుని దర్శనం చేసుకున్నారు. వేద పండితులు మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించగా, ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు.ఈ పర్యటనలో ఎమ్మెల్యేలు పులివర్తి నాని, గురజాల జగన్మోహన్, డాక్టర్ మురళీ మోహన్ తదితరులు పాల్గొన్నారు. మంత్రి లోకేశ్ పర్యటన సందర్భంగా ఆలయ పరిసరాల్లో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా నిర్వహించారు. భక్తులతో ఆప్యాయంగా ముచ్చటించిన లోకేశ్కు పలువురు అభిమానులు స్వాగతం పలికారు. రాజకీయ కార్యక్రమాలకు దూరంగా, పూర్తిగా ఆధ్యాత్మిక భావంతో ఈ పర్యటన సాగినట్లు ఆయన సన్నిహితులు తెలిపారు.
