మే 30, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్లో పార్టీ బలోపేతంపై దృష్టి సారించిన బీఆర్ఎస్, నేడు తెలంగాణ భవన్లో గ్రేటర్ హైదరాబాద్కు చెందిన ముఖ్య నాయకులతో కీలక సమావేశం నిర్వహించనుంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు.గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయడం, ప్రజా సమస్యలపై చేపట్టాల్సిన ఉద్యమాలు, సభ్యత్వ నమోదు కార్యక్రమం, క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకలాపాల విస్తరణ వంటి అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించే అవకాశం ఉంది.అలాగే నగరంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, అధికార పార్టీపై అనుసరించాల్సిన వ్యూహాలు, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే దిశగా కేటీఆర్ నేతలకు మార్గనిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది.గ్రేటర్ పరిధిలో పార్టీ ప్రభావాన్ని మరింత పెంచడంతో పాటు ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ గళాన్ని బలంగా వినిపించేందుకు కార్యాచరణ రూపొందించే లక్ష్యంతో ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. సమావేశానికి నగరంలోని కీలక నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ బాధ్యులు హాజరుకానున్నారు.
