మే 30, (నేటి తెలుగు పత్రిక): మహిళల రాజకీయ సాధికారతకు మరింత ప్రాధాన్యం కల్పించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలన్న తెలుగుదేశం పార్టీ నిర్ణయం దేశ రాజకీయాల్లో విస్తృత చర్చకు దారితీసిందని పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ల అంశాన్ని అన్ని రాజకీయ పార్టీలు స్వాగతించే పరిస్థితి ఏర్పడుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.డీలిమిటేషన్ అంశంపై మాట్లాడుతూ, 2011 జనాభా లెక్కల ఆధారంగా అయినా, తాజా జనాభా గణాంకాల ఆధారంగా అయినా కొన్ని రాష్ట్రాలకు నష్టం జరిగే అవకాశం ఉందని తెలిపారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం ఉన్న శాసన, పార్లమెంట్ స్థానాలను 50 శాతం మేర పెంచితే అన్ని రాష్ట్రాలకు సమాన న్యాయం జరిగే అవకాశముందని సూచించారు. పెంచిన స్థానాల్లో మహిళలకు రిజర్వేషన్లు అమలు చేస్తే మహిళల రాజకీయ ప్రాతినిధ్యం గణనీయంగా పెరుగుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. గతంలో మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించిన వర్గాల ఆలోచనల్లో కూడా మార్పు రావచ్చని అభిప్రాయపడ్డారు.పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లుల విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన సంకల్పంతో ముందుకు సాగుతోందని తెలిపారు. ఈ రెండు అంశాలను వేర్వేరుగా కాకుండా సమగ్రంగా చూడాల్సిన అవసరం ఉందన్నారు. మహిళా రిజర్వేషన్ మరియు డీలిమిటేషన్ బిల్లులు కలిపి అమలులోకి వస్తేనే మహిళలకు పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు.దేశ రాజకీయ వ్యవస్థలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడమే కాకుండా, ప్రజాస్వామ్యానికి మరింత బలాన్ని చేకూర్చేలా ఈ రెండు బిల్లులు కీలక పాత్ర పోషిస్తాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మహిళా సాధికారత, సమాన రాజకీయ అవకాశాల దిశగా ఇవి చారిత్రాత్మక నిర్ణయాలుగా నిలుస్తాయని ఆయన అభివర్ణించారు.
