మే 30, (నేటి తెలుగు పత్రిక): పోలవరం జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం నేపథ్యంలో ప్రజలు, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. పులి కదలికలను ఎప్పటికప్పుడు గుర్తించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిరంతర పర్యవేక్షణ వ్యవస్థలను అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఇటీవల చికిలింత పంచాయతీ పరిధిలో పులి దాడిలో తొమ్మిది దూడలు మృతి చెందిన ఘటనపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంఘటన స్థానిక రైతులు, పశుపోషకుల్లో భయాందోళనలు కలిగించిందని పేర్కొన్నారు. ప్రస్తుతం తిమ్మాపురం రిజర్వ్ అటవీ ప్రాంతంలో పులి కదలికలు గుర్తించినట్లు అటవీ శాఖ అధికారులు నివేదించిన నేపథ్యంలో వెంటనే అప్రమత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు.పులి సంచరించే ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేసి, ప్రజలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేయాలని సూచించారు. గ్రామాల సమీపంలో పులి కదలికలు గుర్తించిన వెంటనే సమాచారం అందించే విధంగా వ్యవస్థను బలోపేతం చేయాలని తెలిపారు. పశువుల రక్షణతో పాటు గ్రామస్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు.అటవీ, రెవెన్యూ, పోలీసు శాఖలు సమన్వయంతో పనిచేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి, పులి కనిపించిన సందర్భంలో వెంటనే అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.వన్యప్రాణుల సంరక్షణతో పాటు ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణ కూడా ప్రభుత్వ బాధ్యతేనని పేర్కొన్న పవన్ కళ్యాణ్, పరిస్థితిని 24 గంటల పాటు పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై ప్రభుత్వం నిరంతరం నిఘా ఉంచి ప్రజల భద్రతకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతుందని తెలిపారు.
