మే 30, (నేటి తెలుగు పత్రిక): అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణలో ప్రజలు చురుకైన భాగస్వాములుగా మారాలని ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. అడవులు, వన్యప్రాణులు, జీవవైవిధ్యం పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా అటవీ ప్రాంతాలకు ఆనుకుని ఉన్న గ్రామాల ప్రజలు వన్యప్రాణుల సంరక్షణలో కీలక పాత్ర పోషించాలని కోరారు.రాష్ట్రంలోని రంపచోడవరం, మారేడుమిల్లి అటవీ ప్రాంతాలు, పాపికొండ జాతీయ ఉద్యానవనం పరిధిలో అటవీ శాఖ ఇటీవల విస్తృత స్థాయిలో ప్రత్యేక వేట నిరోధక చర్యలు చేపట్టింది. వన్యప్రాణుల అక్రమ వేటను అరికట్టేందుకు అటవీ సిబ్బంది గాలింపు, నిఘా, కూంబింగ్ కార్యక్రమాలు నిర్వహించి అనేక ప్రమాదకర వేట సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.ఈ ప్రత్యేక ఆపరేషన్లో భాగంగా అటవీ శాఖకు చెందిన ప్రొటెక్షన్ వాచర్లు, యానిమల్ ట్రాకర్లు, ఫీల్డ్ సిబ్బంది అడవుల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 242 వైర్ ఉచ్చులు, 10 ఇనుప ఫుట్ ట్రాప్స్, సుమారు 10 కిలోమీటర్ల పొడవైన విద్యుత్ తీగలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఇవి వన్యప్రాణుల ప్రాణాలకు తీవ్ర ముప్పుగా మారే అవకాశం ఉన్నందున వాటిని తొలగించడం ద్వారా అనేక జంతువులను రక్షించినట్లయిందని అధికారులు తెలిపారు.ఈ సందర్భంగా అటవీ శాఖ సిబ్బంది సేవలను పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా అభినందించారు. అడవుల్లో కష్టసాధ్యమైన పరిస్థితుల్లో పనిచేస్తూ వన్యప్రాణుల సంరక్షణకు అంకితభావంతో సేవలందిస్తున్న సిబ్బంది కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు. అక్రమ వేటను అరికట్టడంలో వారి పాత్ర ఎంతో కీలకమని అన్నారు.
