మే 30, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టికెట్ ధరలను పెంచే ఆలోచన లేదని, ఆర్టీసీ ప్రైవేటీకరణ కూడా జరగదని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి స్పష్టం చేశారు. టికెట్ ధరల పెంపు, ప్రైవేటీకరణపై వస్తున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ఆయన తెలిపారు.ఆర్టీసీ ఆర్థికంగా బలమైన స్థితిలో ఉందని పేర్కొన్న మంత్రి, సంస్థకు రూ.25 వేల కోట్ల నుంచి రూ.30 వేల కోట్ల వరకు విలువైన ఆస్తులు ఉన్నాయని చెప్పారు. ప్రజలకు మెరుగైన రవాణా సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు.ప్రజా రవాణాను మరింత ఆధునికీకరించేందుకు త్వరలో 2,500 విద్యుత్ బస్సులు, 500 సీఎన్జీ బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి తెలిపారు. పర్యావరణ హిత రవాణా వ్యవస్థను ప్రోత్సహించే దిశగా ఈ చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.అలాగే సంస్థలో అవసరమైన ఖాళీలను దశలవారీగా భర్తీ చేస్తామని, ఉద్యోగుల సంక్షేమంతో పాటు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి రాంప్రసాద్రెడ్డి తెలిపారు.
