మే 30, (నేటి తెలుగు పత్రిక): ఖరీఫ్ సీజన్కు ముందుగానే రైతులకు ఊరటనిస్తూ ధవళేశ్వరం బ్యారేజీ నుంచి కాలువలకు మే 31 నుంచి సాగునీటిని విడుదల చేయనున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. తూర్పుగోదావరి జిల్లా నీటిపారుదల సలహా మండలి సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.మంత్రి కందుల దుర్గేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని ఖరీఫ్ సాగుకు అవసరమైన నీటి పంపిణీ ప్రణాళికపై విస్తృతంగా చర్చించారు. ప్రస్తుతం కాలువల మరమ్మతు పనులు కొనసాగుతున్న నేపథ్యంలో పరిస్థితులను బట్టి దశలవారీగా వివిధ కాలువలకు నీటిని విడుదల చేయనున్నట్లు మంత్రి తెలిపారు. రైతులకు సాగునీటి కొరత తలెత్తకుండా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని పేర్కొన్న ఆయన, ఖరీఫ్ సాగు పనులకు రైతులు ముందస్తుగా సిద్ధం కావాలని సూచించారు. వ్యవసాయ అవసరాలకు తగిన విధంగా నీటి సరఫరా జరిగేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడించారు.ఈ సందర్భంగా ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల మరమ్మతుల కోసం రూ.148 కోట్లు మంజూరు చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలుపుతూ సమావేశంలో ప్రత్యేక తీర్మానం చేశారు. అలాగే గోదావరి నది కాలుష్య నివారణ చర్యల కోసం రూ.100 కోట్లు కేటాయించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ధన్యవాదాలు తెలియజేస్తూ మరో తీర్మానాన్ని ఆమోదించారు. రాబోయే ఖరీఫ్ సీజన్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సాగునీటి నిర్వహణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు.
