Breaking News

మహానాడు విజయంతో టీడీపీలో నూతన ఉత్సాహం: నేతలు, కార్యకర్తలకు చంద్రబాబు అభినందనలు

మే 30, (నేటి తెలుగు పత్రిక): తెలుగుదేశం పార్టీ మహానాడు విజయవంతంగా నిర్వహించబడటంతో పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొందని ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శులు, జోనల్ ఇన్‌చార్జ్‌లు, ముఖ్య నాయకులతో నిర్వహించిన వీడియో సమావేశంలో ఆయన మహానాడు నిర్వహణపై సమీక్ష చేపట్టి నేతలు, కార్యకర్తలను అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తొలిసారిగా హైబ్రిడ్ విధానంలో నిర్వహించిన మహానాడు ఘన విజయాన్ని సాధించిందని పేర్కొన్నారు. కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, నిర్వాహకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ సిద్ధాంతాలు, ప్రభుత్వ విజయాలు, భవిష్యత్ లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మహానాడు కీలక వేదికగా నిలిచిందన్నారు.తెలంగాణకు సంబంధించిన అంశాలపై మాట్లాడేటప్పుడు నాయకులు మరింత బాధ్యతతో వ్యవహరించాలని చంద్రబాబు సూచించారు. చారిత్రక, ప్రాంతీయ అంశాల విషయంలో ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా జాగ్రత్తగా మాట్లాడాలని అన్నారు. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తెలుగు ప్రజలంతా ఒకే కుటుంబమని, ప్రాంతాల మధ్య విభేదాలకు తావులేకుండా ఐక్యతను కాపాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తెలంగాణ నేలపై జరిగిన విషయాన్ని గుర్తుచేసిన ఆయన, ఆ ప్రాంతంలో ఇప్పటికీ పార్టీకి బలమైన కార్యకర్తల బలం ఉందన్నారు. తెలంగాణలో సామాజిక న్యాయం, అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ విశేష కృషి చేసిందని తెలిపారు. అక్కడ మహానాడు ఉత్సాహభరితంగా నిర్వహించడం పార్టీ శక్తిని మరోసారి చాటిందన్నారు. మహానాడులో ఆమోదించిన మహిళలకు 33 శాతం రాజకీయ రిజర్వేషన్ల తీర్మానాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పార్టీ నాయకులకు సూచించారు. మహిళల సాధికారతకు తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచో కట్టుబడి ఉందని, ఈ నిర్ణయం దేశ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసిందని పేర్కొన్నారు.ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేయాలని, ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాన్ని వాస్తవాలతో తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు. మహానాడు ఇచ్చిన ఉత్సాహంతో మరింత సమన్వయంతో పనిచేసి పార్టీని బలోపేతం చేయాలని ఆయన సూచించారు.

ఖరీఫ్‌కు శుభవార్త.. ధవళేశ్వరం కాలువలకు నేటి నుంచే నీటి విడుదల: మంత్రి కందుల దుర్గేష్

ఆర్టీసీ టికెట్ ధరల పెంపు లేదు.. ప్రైవేటీకరణ జరగదు: మంత్రి రాంప్రసాద్‌రెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *