మే 30, (నేటి తెలుగు పత్రిక): ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని ఇందిరా భవన్లో ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో బూత్ లెవల్ ఏజెంట్లు, సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్లతో విస్తృత స్థాయి సమీక్ష సమావేశాలు నిర్వహించారు.పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా జరిగిన ఈ సమావేశాల్లో ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, రాష్ట్ర, జిల్లా స్థాయి సమన్వయకర్తలు పాల్గొన్నారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని పార్టీ నాయకత్వం సూచించింది.ఈ సందర్భంగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, ఓటర్ల జాబితా అంశాన్ని కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటోందన్నారు. దేశవ్యాప్తంగా ఓట్ల తొలగింపుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఓటును కాపాడాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించడంతో పాటు, బూత్ స్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాల అమలు, పార్టీ బలోపేతం, ఓటర్ల జాబితా పరిశీలన వంటి అంశాలపై మంత్రులు, పార్టీ నేతలు క్రమం తప్పకుండా క్షేత్రస్థాయిలో పర్యటిస్తారని వెల్లడించారు.రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఓటరును గుర్తించడం, అర్హులైన వారందరి పేర్లు జాబితాలో ఉండేలా చర్యలు చేపట్టడం, అక్రమాలపై వెంటనే స్పందించే వ్యవస్థను ఏర్పాటు చేయడం కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని నాయకులు స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణలో భాగంగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై ప్రత్యేక దృష్టి కొనసాగిస్తామని తెలిపారు.
