హైదరాబాద్, మే 30, (నేటి తెలుగు పత్రిక): బీఆర్ఎస్ పార్టీ రాజకీయ డ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ బలయ్యారని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ విమర్శించారు. శనివారం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ అగ్రనాయకత్వం అనుసరిస్తున్న రాజకీయ విధానాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.బాల్క సుమన్తో వివాదాస్పద వ్యాఖ్యలు చేయించింది ఎవరో బయటపడాల్సిన అవసరం ఉందని దయాకర్ అన్నారు. రైల్వే పట్టాలు కోయాలని, దాడులకు పాల్పడాలని పిలుపునివ్వడం బీఆర్ఎస్ రాజకీయ సంస్కృతికి నిదర్శనమని ఆరోపించారు. ఈ విధమైన రాజకీయాలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కారణమని, అదే ధోరణిని కేటీఆర్కు, అనంతరం బాల్క సుమన్కు బోధించారని విమర్శించారు.కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన లోపాలు, ఫార్ములా-ఈ రేస్ వ్యవహారంపై ప్రశ్నిస్తే బీఆర్ఎస్ నేతలు ‘జై తెలంగాణ’ పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని దయాకర్ ఆరోపించారు. తప్పులు చేసి వాటిని సమర్థించుకోవడం బీఆర్ఎస్ నాయకులకు అలవాటుగా మారిందన్నారు.ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగ సంఘాలు, రైతులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందడమే బీఆర్ఎస్ లక్ష్యమని ఆయన విమర్శించారు. అధికారం కోసం ఎలాంటి చర్యలకైనా దిగజారేందుకు ఆ పార్టీ సిద్ధంగా ఉంటుందని ఆరోపించారు.బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యల వెనుక ఎవరి పాత్ర ఉందో పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేసి నిజాలు వెలుగులోకి తీసుకురావాలని అద్దంకి దయాకర్ డిమాండ్ చేశారు.
