Breaking News

చెత్త నుంచి సంపద సృష్టించాలి.. రాష్ట్రంలో మరిన్ని వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు: పవన్ కళ్యాణ్

మే 31, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో చెత్త నిర్వహణను ఆదాయ వనరుగా మార్చే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు ఇంధన అవసరాలకు ప్రత్యామ్నాయ మార్గాలను సృష్టించవచ్చని అన్నారు. పల్నాడు జిల్లా కొండవీడులోని జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్‌ను సందర్శించిన ఆయన, చెత్తను శాస్త్రీయ పద్ధతుల్లో వినియోగించి సంపదగా మార్చే విధానాలపై అధికారులతో సమగ్రంగా చర్చించారు. ప్లాంట్‌లో చెత్త సేకరణ, వర్గీకరణ, శుద్ధి ప్రక్రియలు, విద్యుత్ ఉత్పత్తి విధానాన్ని పవన్ కళ్యాణ్ పరిశీలించారు. చెత్తను బాయిలర్లలో మండించడం ద్వారా విద్యుత్తు ఉత్పత్తి చేయడం, అనంతరం మిగిలే బూడిదను ఇటుకల తయారీకి వినియోగించడం వంటి అంశాలపై అధికారులు వివరాలు అందించారు. ఈ సందర్భంగా ప్లాంట్ పనితీరును ప్రశంసించిన పవన్ కళ్యాణ్, చెత్తను సరైన విధంగా నిర్వహిస్తే పర్యావరణానికి మేలు చేయడంతో పాటు స్థానిక సంస్థలకు ఆదాయ వనరులు కూడా సృష్టించవచ్చని పేర్కొన్నారు.రాష్ట్రంలో ప్రతిరోజూ సుమారు 7,200 టన్నుల పొడి చెత్త ఉత్పత్తి అవుతోందని ఆయన వెల్లడించారు. కొండవీడు ప్లాంట్ రోజుకు 1,400 టన్నుల చెత్తను ప్రాసెస్ చేసి సగటున 20 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉందని చెప్పారు. ఈ విద్యుత్తును రాష్ట్ర విద్యుత్ గ్రిడ్‌కు అనుసంధానం చేసి ఇంధన అవసరాల తీర్చడంలో వినియోగిస్తున్నట్లు వివరించారు.ఉత్తరాంధ్ర ప్రాంతానికి సేవలందిస్తున్న విశాఖపట్నంలోని జిందాల్ ప్లాంట్ కూడా చెత్త నుంచి 15 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేస్తోందని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇదే తరహాలో రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. కాకినాడలో ఇప్పటికే కొత్త ప్లాంట్ పనులు ప్రారంభమయ్యాయని, నెల్లూరు, కడప, కర్నూలు, విజయవాడ, తిరుపతి ప్రాంతాల్లో కూడా త్వరలో ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.గ్రామీణ ప్రాంతాల్లో చెత్త నిర్వహణపై ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పంచాయతీల వారీగా చెత్త సేకరణ, వేరు చేయడం, నిల్వ చేయడం వంటి అంశాలపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. చెత్త ద్వారా ఆదాయం ఎలా పొందవచ్చు, డంపింగ్ యార్డుల అవసరాన్ని ఎలా తగ్గించవచ్చు అనే అంశాలపై గ్రామస్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు.రాష్ట్రంలో స్వచ్ఛత, పర్యావరణ పరిరక్షణ, ఇంధన ఉత్పత్తి అనే మూడు లక్ష్యాలను ఒకేసారి సాధించే దిశగా వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టులు కీలక పాత్ర పోషిస్తాయని పవన్ కళ్యాణ్ అన్నారు. భవిష్యత్తులో ప్రతి ప్రాంతంలో శాస్త్రీయ చెత్త నిర్వహణ వ్యవస్థను అభివృద్ధి చేసి, చెత్తను సమస్యగా కాకుండా సంపదగా మార్చే విధానాన్ని అమలు చేస్తామని స్పష్టం చేశారు.

అమరావతిలో మధ్యతరగతి, పేదలకు గృహ సముదాయాలు.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

తుంగభద్రలో హైదరాబాదీలు మృతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *