మే 31, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ శివారులోని బొల్లారం ప్రాంతంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భర్తతో కలిసి ఇంటికి వెళ్తున్న మహిళను గుర్తుతెలియని దుండగులు అత్యంత క్రూరంగా హత్య చేయడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, వెంకటేశ్వర కాలనీకి చెందిన దంపతులు సంత నుంచి తిరిగి వస్తుండగా ఐడీఏ క్రీడా ప్రాంగణం సమీపంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు వారిని అడ్డగించారు. మహిళతో అసభ్యంగా ప్రవర్తించేందుకు ప్రయత్నించగా, భర్త అడ్డుకోవడంతో అతనిపై కత్తితో దాడి చేశారు.దాడిలో భర్త గాయపడగా, అనంతరం దుండగులు మహిళపై విచక్షణారహితంగా దాడి చేసి గొంతు కోసి హత్య చేసినట్లు సమాచారం. భర్త కళ్లముందే ఈ ఘోరం జరగడం స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గాయపడిన భర్తను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనాస్థల పరిసరాల్లోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తూ నిందితుల గుర్తింపునకు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.ఈ దారుణ ఘటనతో బొల్లారం ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. మహిళ భద్రతపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్న నేపథ్యంలో నిందితులను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
