Breaking News

సైకిల్‌పై సొంతూరికి మంత్రి.. పొలంలో ట్రాక్టర్ నడిపి రైతులతో మమేకం

జూన్ 01, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదివారం తన స్వగ్రామంలో గడుపుతూ రైతు జీవితాన్ని మరోసారి ఆస్వాదించారు. అధికార కార్యక్రమాలకు విరామం ఇచ్చి సొంతూరికి వెళ్లిన ఆయన, వ్యవసాయ పనుల్లో పాల్గొని రైతులతో మమేకమయ్యారు.పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నుంచి తెల్లవారుజామునే సైకిల్‌పై బయలుదేరిన మంత్రి, తన స్వగ్రామం అగర్తిపాలెంకు చేరుకున్నారు. గ్రామంలో సాధారణ రైతుల మాదిరిగా తిరుగుతూ వ్యవసాయ పరిస్థితులను పరిశీలించారు. ముందుగా తన రొయ్యల చెరువును సందర్శించి సాగు విధానాలు, ఉత్పత్తి పరిస్థితులపై ఆరా తీశారు.అనంతరం వరి పొలంలోకి వెళ్లిన మంత్రి స్వయంగా ట్రాక్టర్ నడిపి దుక్కి దున్నారు. పొలాల్లో పనిచేస్తున్న రైతులు, కూలీలతో మాట్లాడి వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. రైతు కుటుంబంలో జన్మించిన వ్యక్తిగా వ్యవసాయంతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.గ్రామ పర్యటన అనంతరం తిరుగు ప్రయాణంలో కూడా సైకిల్‌పైనే పాలకొల్లుకు బయలుదేరిన మంత్రి, మార్గమధ్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. జల జీవన్ మిషన్ కింద పైప్‌లైన్ పనులు జరుగుతున్న ప్రాంతంలో ఆగి అధికారులకు కీలక సూచనలు చేశారు. భవిష్యత్తులో రహదారులు దెబ్బతినకుండా ముందస్తు ప్రణాళికతో పనులు చేపట్టాలని ఆదేశించారు.ప్రజాధనం వృథా కాకుండా శాఖల మధ్య సమన్వయంతో అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయాలని సూచించిన మంత్రి, ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు.మంత్రి నిమ్మల రామానాయుడు సైకిల్‌పై సొంతూరికి వెళ్లి రైతులతో కలిసి గడపడం, వ్యవసాయ పనుల్లో పాల్గొనడం స్థానిక ప్రజల్లో ఆసక్తిని రేకెత్తించింది. రైతు జీవన విధానాన్ని దగ్గరగా తెలుసుకుంటూ ప్రజల సమస్యలపై ప్రత్యక్ష అవగాహన పొందడం అభినందనీయమని గ్రామస్థులు పేర్కొన్నారు.

విశాఖలో ఎయిర్ ట్రంక్ క్యాంపస్ ఏర్పాటు చేయండి

జాతీయ బీసీ సంక్షేమ సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించారు..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *