జూన్ 01, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తుని నియోజకవర్గ పర్యటనలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. పేదల ఇంటికే వెళ్లి పెన్షన్ అందజేయడం ద్వారా కలిగే ఆనందం ప్రత్యేకమని పేర్కొంటూ, అందుకే కేవలం బటన్ నొక్కే విధానానికి తాను ప్రాధాన్యం ఇవ్వడం లేదని అన్నారు.
కాకినాడ జిల్లా చామవరం గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన సీఎం, రాష్ట్రంలో 62 లక్షలకు పైగా కుటుంబాలకు పెన్షన్ల ద్వారా ఆర్థిక భరోసా అందిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో పెన్షన్ తీసుకోకపోతే రద్దు చేసే పరిస్థితులు ఉండేవని, ప్రస్తుతం అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
ప్రతి కుటుంబానికి కనీసం నాలుగు సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం పనిచేస్తోందని వెల్లడించారు. మహిళల రాజకీయ సాధికారతకు ప్రాధాన్యం ఇస్తూ, శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలుకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు.
రైతుల ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లకు చేరవేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని, గ్యాస్ ధరలు పెరిగినా మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని కొనసాగిస్తున్నామని తెలిపారు.
అలాగే ఎన్నికల సమయంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు పవన్ కళ్యాణ్తో కలిసి పనిచేశామని, మూడు పార్టీల కూటమిగా ప్రజల ముందుకు వెళ్లి విజయం సాధించామని చంద్రబాబు గుర్తు చేశారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
