జూన్ 02, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన ప్రాజెక్టుల విషయంలో పొరుగు రాష్ట్రాలతో అనవసర ఘర్షణలు సృష్టించకుండా చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ సూచించారు. హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు అంశాలపై స్పందించారు.
మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రికి అపాయింట్మెంట్ లభించకపోతే, తాను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో మాట్లాడి సమావేశం ఏర్పాటు చేసేలా కృషి చేస్తానని తెలిపారు.
రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలను రాజకీయ కోణంలో కాకుండా అభివృద్ధి కోణంలో చూడాలని ఆయన సూచించారు. రాజకీయ లబ్ధి కోసం ప్రాంతీయ భావోద్వేగాలను రెచ్చగొట్టడం మంచిది కాదని పేర్కొన్నారు.
తెలంగాణకు సంబంధించిన నీటి ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కేంద్ర ప్రభుత్వం, తమ పార్టీ ఎల్లప్పుడూ సహకారం అందిస్తాయని బండి సంజయ్ స్పష్టం చేశారు.
