బీసీ కులగణన శాస్త్రీయంగా జరిగింది – మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం బలహీన వర్గాలకు న్యాయం చేయాలని చిత్తశుద్ధితో బీసీ కులగణన (Caste Census) నిర్వహించిందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆయన తాజాగా మీడియాతో మాట్లాడుతూ, ఈ సర్వేను శాస్త్రీయంగా, పారదర్శకంగా చేపట్టామని స్పష్టం చేశారు.
గ్రామాల్లో ఇంటి ఇంటికీ వెళ్లి డేటా సేకరణ
రాష్ట్రంలో ఉన్న ఐఏఎస్ల ఆధ్వర్యంలో దాదాపు లక్ష మంది ప్రభుత్వ ఉద్యోగులను గ్రామాల్లో ఇంటి ఇంటికి పంపించి సమాచారం సేకరించామని మంత్రి వెల్లడించారు. అయితే, కొంత మంది మేధావులు, సంఘాల నేతలు తప్పుగా వ్యాఖ్యానిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం లక్ష్యం బలహీన వర్గాలకు న్యాయం చేయడమేనని, ఎవరికైనా అనుమానాలుంటే తాము వివరాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
కులగణనపై ఎవరికైనా అనుమానాలుంటే, తాము వివరణకు సిద్ధం
కుల గణన లెక్కలపై ఎవరికైనా అనుమానాలుంటే, వారు ఎక్కడికి రావాలన్నా తాము సిద్ధంగా ఉన్నామని మంత్రి సవాల్ విసిరారు. బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే, ప్రభుత్వ నిర్ణయాలకు సలహాలు ఇవ్వాలని, కానీ ప్రెస్ మీట్ల ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించొద్దని సూచించారు.
సీఎల్పీ సమావేశం అనంతరం వివరణ
నేడు సీఎల్పీ సమావేశం అనంతరం మళ్లీ మీడియా ముందుకు వస్తామని, రిటైర్డ్ జస్టిస్ ఈశ్వరయ్య, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు, ఆర్. కృష్ణయ్య, మాజీ హైకోర్టు అధికారి పూర్ణచందర్, జాజుల శ్రీనివాస్ వంటి మేధావులతో సమావేశమై కుల గణన నివేదికపై పూర్తి వివరాలు వెల్లడిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు.
సర్వే అమలుకు రోడ్మ్యాప్ సిద్ధం చేయాలి
కులగణన వివరాలను సమగ్రంగా అధ్యయనం చేసి, దాని అమలుకు ఒక రోడ్ మ్యాప్ రూపొందించాలని సూచించారు. ప్రభుత్వం బలహీన వర్గాల హక్కుల కోసం కట్టుబడి ఉందని, అందరూ కలిసి ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.
ఈ నేపథ్యంలో బీసీ కులగణనపై చర్చలు మరింత వేడెక్కుతున్నాయి. ప్రభుత్వ దృష్టికోణం, మేధావుల అభిప్రాయాలు ఏవిధంగా సాగుతాయన్నది ఆసక్తిగా మారింది.
