సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఫైర్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పై బీఆర్ఎస్ మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (Vemula Prashanth Reddy) తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డికి “మాట తప్పడం అలవాటే” అని ఆరోపించారు.
ఎల్ఆర్ఎస్ (LRS) విషయంలో యూటర్న్ – ప్రశాంత్ రెడ్డి
ఎల్ఆర్ఎస్ (LRS) విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఒక మాట, అధికారంలోకి వచ్చాక మరో మాట మాట్లాడుతోందని విమర్శించారు. “LRS పేరిట ప్రజలను దోచుకోవడానికి ఈ ప్రభుత్వం సిద్ధమైంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చినప్పుడు కాంగ్రెస్ పెద్ద ఎత్తున విమర్శలు చేసింది. మరి ఇప్పుడు ఏమంటుందో ప్రజలు గమనించాలని” ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు.
“ఎన్నికల సమయంలో పేదలకు ఎల్ఆర్ఎస్ పూర్తిగా ఉచితంగా చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు కేవలం 25% మాత్రమే రాయితీ ఇస్తామని ప్రకటించడం మోసమే” అని ఆయన విమర్శించారు. “రేవంత్ రెడ్డి తన ఖజానా నింపుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి” అంటూ డిమాండ్ చేశారు.
ఎల్ఆర్ఎస్ పథకంలో కొత్త మార్పులు
ఈ నేపథ్యంలో ఎల్ఆర్ఎస్ పథకం (LRS Scheme) అమలులో కొన్ని మార్పులను రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. మార్చి 31 వరకు ఎల్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి 25% రాయితీ కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
- వ్యక్తిగతంగా ప్లాట్లు కొనుగోలు చేసి రిజిస్టర్ చేసుకోని వారికి,
- లేఅవుట్లో విక్రయించని ప్లాట్లను రెగ్యులరైజ్ చేసుకునే వారికి,
- 10% ప్లాట్లు రిజిస్టర్ అయి మిగిలిపోయిన 90% లే అవుట్లో ఉన్న వారికి
- సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ కలిగిన వారికి
ఈ వెసులుబాటును ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. మార్చి 31 లోగా ఎల్ఆర్ఎస్ చేసుకుంటే 25% రాయితీ పొందే అవకాశం ఉంటుందని మంత్రులు స్పష్టం చేశారు.
ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ విషయంలో తీసుకున్న నిర్ణయం ప్రజలకి ఎంత మేరకు అనుకూలంగా మారుతుందో చూడాలి.
