|| The problems of journalists will be brought to the attention of the CM and resolved || – మంత్రి కొండా సురేఖ
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న జర్నలిస్టుల సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హామీ ఇచ్చారు.
మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (HUJ-TWJF) నాయకులు మంత్రి కొండా సురేఖను కలిశారు. ఈ సందర్భంగా HUJ 2025 మీడియా డైరీని మంత్రికి అందజేశారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను HUJ అధ్యక్షుడు అరుణ్ కుమార్, కార్యదర్శి జగదీశ్వర్ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
జర్నలిస్టులకు హెల్త్ కార్డులు – బీమా అమలు చేయాలి
- జర్నలిస్టుల కుటుంబాలకు హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని నేతలు మంత్రి సురేఖను కోరారు.
- ప్రభుత్వ ఉద్యోగులకు కొత్తగా ఇస్తున్న హెల్త్ కార్డులతో పాటు జర్నలిస్టులకు కూడా హెల్త్ కార్డులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
- లేదంటే ప్రతి జర్నలిస్టుకు ఏటా రూ. 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ అందించాలని సూచించారు.
- రైతు బీమా మాదిరిగా, అక్రిడిటేషన్ కార్డు ఉన్న జర్నలిస్టులకు జర్నలిస్టు బీమా అమలు చేయాలని కోరారు.
- అకాల మరణాల ఘటనల్లో జర్నలిస్టుల కుటుంబాలకు రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల జీవిత బీమా అందించే పథకాన్ని తీసుకురావాలని సూచించారు.
సానుకూలంగా స్పందించిన మంత్రి..
- జర్నలిస్టుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక లేఖ రాస్తానని మంత్రి కొండా సురేఖ హామీ ఇచ్చారు.
- జర్నలిస్టుల సమస్యలపై ఐ అండ్ పీఆర్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కూడా చర్చిస్తానని తెలిపారు.
- ఇండ్ల స్థలాల విషయంలో సీఎం నిర్ణయానికి అనుగుణంగా ముందుకు వెళ్లాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
మంత్రి సన్మానంలో పాల్గొన్న జర్నలిస్టులు
ఈ సందర్భంగా హెచ్ఎయూజే మహిళా జర్నలిస్టులు కంచి లలిత, పెద్దిరెడ్డి విజయ తదితరులు మంత్రికి శాలువా కప్పి సన్మానించారు.
మంత్రిని కలిసిన వారిలో HUJ వర్కింగ్ ప్రెసిడెంట్ గండ్ర నవీన్, కోశాధికారి బట్టిపాటి రాజశేఖర్, నాయకులు చిట్యాల మధుకర్, క్రాంతి, కొడవటి నవీన్, పూర్ణచందర్, రాజు, రేణయ్య తదితరులు పాల్గొన్నారు.