మార్చి 29, నేటి తెలుగు పత్రిక: తెలంగాణలో వృద్ధ తల్లిదండ్రుల సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘తల్లిదండ్రుల సంరక్షణ ఉద్యోగుల బాధ్యత’ పేరుతో తీసుకొచ్చిన బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది.ఈ కొత్త చట్టం ప్రకారం, తల్లిదండ్రులను పట్టించుకోని ప్రభుత్వ ఉద్యోగుల జీతంలో 15 శాతం కోత విధించి, ఆ మొత్తాన్ని నేరుగా తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేస్తారు. ఈ నిబంధనలు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రజాప్రతినిధులకు కూడా వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.ఇటీవల కాలంలో వృద్ధ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ చట్టాన్ని తీసుకొచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు ఆర్థిక భరోసా కల్పించడం, కుటుంబ విలువలను కాపాడడం ఈ నిర్ణయానికి ప్రధాన లక్ష్యమని పేర్కొంది.ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, పిల్లల కోసం జీవితాన్ని అంకితం చేసే తల్లిదండ్రులను వృద్ధాప్యంలో వదిలేయడం సమాజానికి తగదని అన్నారు. ఈ చట్టం అలాంటి వారికీ గుణపాఠంగా మారుతుందని, అవసరమైతే సామాజికంగా కూడా వారిని ప్రశ్నించాల్సిన అవసరం ఉందని సూచించారు.మొత్తంగా, ఈ నిర్ణయం తెలంగాణలో కుటుంబ విలువలు, సామాజిక బాధ్యతలపై పెద్ద చర్చకు దారితీస్తోంది.
