హైదరాబాద్, మార్చి 29, నేటి తెలుగు పత్రిక: సమాజంలో తల్లిదండ్రుల సంరక్షణకు ప్రాధాన్యం పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం కొత్త చట్టంతో ముందుకు వచ్చింది. శాసనసభలో ప్రవేశపెట్టిన “తెలంగాణ ఎంప్లాయిస్ అకౌంటబిలిటీ, మానిటరింగ్ ఆఫ్ పేరెంటల్ సపోర్ట్ బిల్లు–2026”పై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు ఆర్థిక, సామాజిక భద్రత కల్పించడమే ఈ చట్టం లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. కుటుంబ బంధాలు తగ్గిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే వారికి ఇది గట్టి హెచ్చరికగా నిలుస్తుందని పేర్కొన్నారు.దేశంలో పిల్లలు, మహిళల రక్షణ కోసం అనేక చట్టాలు అమల్లో ఉన్నప్పటికీ, వృద్ధుల సంరక్షణ విషయంలో ఇంకా లోపాలు ఉన్నాయని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కొత్త బిల్లు ద్వారా తల్లిదండ్రుల పట్ల బాధ్యతను చట్టబద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు.ఈ చట్టం పరిధిలో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులతో పాటు ప్రజాప్రతినిధులను కూడా చేర్చడం విశేషం. తల్లిదండ్రులను చూసుకోని వారిపై చర్యలు తీసుకునేలా నిబంధనలు తీసుకురానున్నట్లు ప్రభుత్వం సంకేతాలు ఇచ్చింది.వృద్ధ తల్లిదండ్రుల్లో భద్రతాభావాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఈ బిల్లును తీసుకువచ్చామని సీఎం తెలిపారు. సమాజంలో ఎవరూ అనాథలుగా మిగలకుండా చూడాలని, ఈ బిల్లుకు అన్ని పక్షాలు మద్దతు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
