మార్చి 30, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్లో న్యాయవాదుల రక్షణ అంశంపై మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. గట్టు వామన్రావు దంపతుల హత్య కేసును ప్రస్తావిస్తూ, ఆ ఘటనలో బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దల పాత్రపై ఆయన ఆరోపణలు గుప్పించారు. బీఆర్ఎస్ హయాంలో మంథని నియోజకవర్గంలోని రామగిరి మండలంలో న్యాయవాది వామన్రావు దంపతులను పట్టపగలే దారుణంగా హత్య చేసిన ఘటనను మంత్రి గుర్తుచేశారు. ఈ కేసులో అసలు నిందితులను ఇప్పటికీ పూర్తిగా గుర్తించలేదని, సీబీఐ విచారణ కొనసాగుతోందని తెలిపారు. పోలీసులు అప్పటి ప్రభుత్వ ప్రభావంతో కేసును నీరుగార్చారని, దర్యాప్తును తప్పుదోవ పట్టించారని మంత్రి ఆరోపించారు. నిజమైన దోషులను తప్పించేందుకు ప్రయత్నాలు జరిగాయని విమర్శించారు.ఈ ఘటన తర్వాత న్యాయవాదుల భద్రతపై ఆందోళనలు పెరిగాయని, ప్రత్యేక రక్షణ చట్టం కోసం వారు నిరంతరం డిమాండ్ చేస్తున్నారని చెప్పారు. అయితే గత ప్రభుత్వం దీనిపై స్పందించలేదని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం న్యాయవాదుల భద్రతకు కట్టుబడి ఉందని స్పష్టం చేసిన మంత్రి, “తెలంగాణ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ బిల్”ను సభలో ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఒక న్యాయవాదిగా ఈ నిర్ణయం తనకు సంతృప్తినిచ్చిందని శ్రీధర్ బాబు పేర్కొన్నారు.
